కాకతీయ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్న బీహార్ లో ఉగ్రవాదుల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాకిస్తాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు టెర్రరిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ సమాచారంతో అలర్ట్ అయిన బీహార్ పోలీస్ యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం బీహార్ లో పర్యటిస్తుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రావల్పిండికి చెందిన హస్నైన్ అలీ, ఉమర్ కోట్ కు చెందిన ఆదిల్ హుస్సేన్, బహవల్ పూర్ కు చెందిన మహ్మద్ ఉస్మాన్ అనే ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు నేపాల్ సరిహద్దు ద్వారా బీహార్ లోకి వచ్చారు. గత వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారించాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన అధికారులు వారి ఫొటోలు, ఇతర వివరాలను అన్ని జిల్లాల పోలీసులకు పంపించారు.
ముఖ్యంగా నేపాల్ తో 729 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు, సీమాంచల్ ప్రాంతంలో భద్రతను గణనీయంగా పెంచినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, జనసమ్మర్థ ప్రదేశాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పెట్రోలింగ్ ను కూడా తీవ్రతరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే తక్షణమే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. మరికొన్ని నెలల్లోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ఆందోళన కలిగిస్తోంది. మే నెలలో రాష్ట్రంలో 18 మంది అనుమానితులను గుర్తించారు. వారిలో ఒకరు ఖలిస్తానీ సానుభూతిపరుడిగా తేలాడు.


