ఆ పది మంది ఎమ్మెల్యేలకు చిక్కులు
బీఆర్ఎస్ ‘విప్’ జారీతో మునిసిపల్లో ఇరకాటం
హంగ్ మున్సిపాలిటీలతో కారు పార్టీకి అనుకోని అవకాశం
చైర్మన్ పీఠాల కోసం ఎక్స్అఫీషియో ఓట్ల ప్రాధాన్యం పెరగడం
విప్ జారీతో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టే ప్లాన్
కాంగ్రెస్కు అనుకూలంగా ఓటేస్తే అనర్హత వేటుకు సిద్ధం
కీలక నియోజకవర్గాల్లో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది
బీఆర్ఎస్ ఎత్తుగడలపై ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రతివ్యూహాలు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్కు ఆశించినంతగా కలిసి రాకపోయినా, అదే ఎన్నికలు ఇప్పుడు ఆ పార్టీకి రాజకీయంగా కీలక అవకాశాన్ని అందిస్తున్నాయనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీల్లో కూడా బీఆర్ఎస్ ప్రభావం పరిమితంగానే ఉండడంతో ఆ పార్టీకి ఇది నిరాశ కలిగించింది. అయితే హంగ్ పరిస్థితులు ఏర్పడిన మున్సిపాలిటీల్లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు మాత్రం బీఆర్ఎస్కు కొత్త రాజకీయ ఆయుధాన్ని అందించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం 30కి పైగా మున్సిపాలిటీల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో చైర్మన్ పీఠాలపై తీవ్ర పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లు ఇప్పుడు కీలకంగా మారాయి. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఒక్కో ఓటు అత్యంత విలువైనదిగా మారడంతో స్థానిక ప్రజాప్రతినిధుల నిర్ణయాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
విప్తో ఫిరాయింపులపై దెబ్బకు సిద్ధం
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం రాజకీయంగా హాట్టాపిక్గా మారింది. ఈ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు విప్ ఆయుధాన్ని వినియోగించాలని బీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. ఎక్స్అఫీషియో ఓటింగ్ సమయంలో పార్టీ ఆదేశాలను కచ్చితంగా పాటించాలనే ఉద్దేశంతో విప్ జారీ చేయాలని పార్టీ నాయకత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీఆర్ఎస్ జారీ చేసిన విప్ను ధిక్కరించి ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు అనుకూలంగా ఓటు వేస్తే, ఆ చర్యను ఆధారంగా తీసుకుని వారి సభ్యత్వాన్ని రద్దు చేయించే దిశగా అడుగులు వేయాలని బీఆర్ఎస్ వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా చట్టపరమైన ఆధారాలు సేకరించి అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేయాలనే లక్ష్యంతో కారు పార్టీ ముందుకు సాగుతున్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కీలక నేతలపై ప్రభావం.. పెరుగుతున్న ఉత్కంఠ
ప్రధానంగా గూడెం మహిపాల్ రెడ్డి, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్ వంటి నేతలపై ఈ విప్ ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. వీరి నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగడం, చైర్మన్ ఎన్నికల్లో వారి ఓటు కీలకం కావడంతో విప్ ద్వారా వారిని రాజకీయంగా ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎత్తుగడలను గమనిస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. విప్ జారీ అయిన పరిస్థితిలో ఓటింగ్లో పాల్గొని రిస్క్ తీసుకోవడం కంటే, ఓటింగ్కు దూరంగా ఉండటమే ఉత్తమ మార్గమని వారు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా చేయడం ద్వారా కాంగ్రెస్తో తమ సంబంధాలను కాపాడుకుంటూనే, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చనేది వారి వ్యూహంగా తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాకుండా, రాష్ట్ర స్థాయి రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


