ఆర్టీసీ సమస్యలపై మూడో రోజు సమీక్ష
కొత్త బస్సులు, రూట్లు మౌలిక సదుపాయాలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యేల డిమాండ్లు
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సేవల మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహిస్తున్న ముఖాముఖి సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొని తమ నియోజకవర్గాల సమస్యలను వివరించారు.మహాలక్ష్మీ పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కొత్త బస్సులు, అదనపు రూట్లు, బస్ స్టేషన్ల అభివృద్ధి, డిపోల ఏర్పాటుపై ఎమ్మెల్యేలు వినతిపత్రాలు సమర్పించారు. ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు.

చెన్నూరు, సింగరేణి ప్రాంతాల్లో కార్మికులకు సౌకర్యంగా ఉండేలా పాత రూట్లతో పాటు కొత్త రూట్లలో బస్సులు నడపాలని సూచనలు వచ్చాయి. కోరుట్ల, మెట్పల్లి బస్ స్టేషన్ల అభివృద్ధి, హైదరాబాద్కు ప్రత్యేక సర్వీసులు, నిలిపివేసిన ట్రిప్పుల పునరుద్ధరణపై ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. వేములవాడకు అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ పెంచాలని, పలు మండలాలకు కొత్త రూట్లు కల్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు.
హుజురాబాద్, పెద్దపల్లి, రామగుండం ప్రాంతాల్లో డిపోలు, మినీ బస్ స్టేషన్లు, అదనపు బస్సుల అవసరాన్ని ఎమ్మెల్యేలు వివరించారు. గోదావరిఖని, కమలాపూర్ ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాల నిర్మాణం ప్రతిపాదించారు. విద్యార్థుల కోసం పాఠశాల సమయాల్లో అదనపు బస్సులు నడపాలని కోరారు.
ఆదిలాబాద్ జిల్లాలో పల్లెవెలుగు బస్సులు పెంపు, పాత బస్ స్టేషన్ల అభివృద్ధి, మారుమూల గ్రామాలకు రూట్లు కల్పనపై డిమాండ్లు వచ్చాయి. బాసర పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని బస్ స్టేషన్ ఆధునీకరణ అవసరాన్ని ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. సిర్పూర్, భైంసా, ఉట్నూరు ప్రాంతాల్లో సేవలు విస్తరించాలని సూచించారు.
ఖమ్మం జిల్లాలో అశ్వారావుపేట, దమ్మపేట, పినపాక, మణుగూరు ప్రాంతాల్లో బస్సుల సంఖ్య పెంపు, శిథిలావస్థలో ఉన్న బస్ స్టేషన్ల పునర్నిర్మాణంపై ఎమ్మెల్యేలు దృష్టి ఆకర్షించారు. సరిహద్దు నియోజకవర్గాలకు అదనపు సర్వీసులు అవసరమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మూడు రోజులుగా ఎమ్మెల్యేల నుంచి వచ్చిన వినతులను సమగ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఆర్టీసీ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బస్ స్టేషన్లలో టాయిలెట్స్, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
కొత్త బస్సులను అవసరాల మేరకు కేటాయిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా కొత్త రూట్ల కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ప్రజా ప్రతినిధులతో ఆర్టీసీ అధికారులు సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.సమావేశంలో పలు జిల్లాల ఎమ్మెల్యేలు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


