ఏటూరునాగారంలో దొంగల బెడద
చిన్న చిన్న డబ్బాలే టార్గెట్!
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం కేంద్రంలో దొంగల ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాళాలు వేసి మూసివేసిన షాపులనే లక్ష్యంగా చేసుకుని దుండగులు రాత్రి వేళల్లో తాళాలు పగులగొట్టి దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
స్థానికుల వివరాల ప్రకారం, దొంగలు పగటి పూట షాపుల పరిస్థితిని గమనించి, రాత్రి సమయాల్లో అమలు చేస్తూ తాళాలు పగులగొట్టి నగదు, చిన్నచిన్న సరుకులను ఎత్తుకెళ్తున్నారు. ముఖ్యంగా చిన్న చిన్న డబ్బాలే టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలతో వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పోలీస్ పహారా సరిపడా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఇటీవల స్థానిక బస్సు డిపోలో కూడా దొంగలు చొరబడి ఇనుప రాడ్లు (రాట్లు) తదితర సామగ్రిని తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. వ్యాపారులు, స్థానికులు పోలీస్ శాఖ వెంటనే స్పందించి రాత్రి పహారాను కట్టుదిట్టం చేయాలని, సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దొంగలను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


