నాగలక్ష్మి ఆలయంలో చోరీ
విగ్రహాలు విలువైన సామాగ్రి అపహరణ
ఆకులవారి ఘనపురంలో ఘటన
గ్రామంలో వరుస దొంగతనాలతో భయాందోళన
కాకతీయ, ఏటూరునాగారం : మండల పరిధిలోని ఆకులవారి ఘనపురం గ్రామంలోని నాగలక్ష్మి దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయం తలుపులను పగలకొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు అక్కడున్న విగ్రహాలు, ఇతర విలువైన వస్తువులను అపహరించినట్లు తెలిసింది.
దొంగిలించబడిన విగ్రహాల విలువ సుమారు రూ.20వేల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆకులవారి ఘనపురం గ్రామంలో ఇంతకు ముందే నాలుగుసార్లు చోరీలు జరిగినప్పటికీ, ఇప్పటి వరకు దొంగలను పట్టుకోవడంలో స్పష్టమైన పురోగతి కనిపించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న చోరీలతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేవాలయాల వద్ద భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దుండగులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసు అధికారులను కోరుతున్నారు.


