వృథాగా పోతున్న పెద్దచెరువు నీరు
తూములను పర్యవేక్షించని నీటిపారుదల శాఖ అధికారులు
కాకతీయ,పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండలంలోని గట్లకుంట గ్రామంలోని పెద్ద చెరువు తూము నుంచి నీరు వృధాగా పోతున్నా నీటిపారుదల శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో భవిష్యత్తులో నీటి గండం తప్పదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురియడంతో చెరువుకు జలకళ ఉట్టిపడుతున్నది. చెరువు నిండుగా ఉండడంతో ఆయకట్టు రైతులకు నీటి తిప్పలు తప్పాయి. అంతే కాకుండా పరిసర ప్రాంత బావుల్లో భూగర్భ జలాలకు సైతం లోటు లేదు. దాదాపు ఈ చెరువు ద్వారా 100-150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతున్నదని సమాచారం.గత వారం రోజులుగా మత్తడి చివర బాగాన రౌతులు కొట్టుకుపోవాడంతో చెరువు తూము నుంచి నీరు వృధా పోతున్నాయని సంబంధిత అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాగే చెరువులోని నీరు వృథాగా పోయినట్లయితే వచ్చే సంవత్సరం సాగునీటికి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తూము నుంచి నీరు పోకుండా చూడాలని నీటిపారుదల శాఖ అధికారులను స్థానిక రైతులు కోరుతున్నారు.


