ముగ్గురు మంత్రులు భూబకాసురులే
వెలుగుమట్లలో పేదల ఇళ్లను కూల్చి అన్యాయం
భూ బాధితుల తరుపున పోరాటం చేస్తాం
బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు విమర్శలు
కాకతీయ, ఖమ్మం : వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేత అన్యాయమని, ముగ్గురు మంత్రులు భూబకాసురుల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు తీవ్రంగా విమర్శించారు. భూభాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలో తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో భూభాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా విన్న ఆయన, వెంటనే స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వెలుగుమట్లలో కొద్దిమందికి మాత్రమే ఇళ్లు కేటాయించి, మిగతా అర్హులను పక్కన పెట్టడం పూర్తిగా అన్యాయమని మండిపడ్డారు. ఎక్కడ ఇళ్లు కూల్చారో అక్కడే తిరిగి నిర్మించే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
భూభాధితుల తరుపున పోరాటం
రాష్ట్రంలో భూముల కబ్జాలపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన, వందల కోట్ల విలువైన భూములను పెద్దలు ఆక్రమించుకుంటుండగా గూడు లేని పేదలపై కఠిన చర్యలు తీసుకోవడం అమానుషమని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని విమర్శించారు. ఇంకా ఇళ్లు పొందని భూభాధితుల వివరాలను సమగ్రంగా సేకరించి, అవసరమైతే న్యాయపరమైన పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కబ్జాలకు గురైన భూదాన్ భూముల సమస్యను వెలికి తీసేంతవరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు సన్నే ఉదయ ప్రతాప్, న్యాయవాది నేరెళ్ల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు నకిరికంటి వీరభద్రం, సీనియర్ నాయకులు వక్కలంక సుబ్రహ్మణ్యం, డోకుపర్తి రవీందర్, రుద్ర ప్రదీప్, మారుతి వీరభద్ర ప్రసాద్, శాసనాల సాయిరాం, పిల్లలమర్రి వెంకట్, బోయినపల్లి చంద్రశేఖర్, కోటేశ్వరరావు, వల్లాల రమేష్, మణికంఠ, ఆంజనేయులు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


