పదో తరగతిలో వంద శాతం ఫలితాలు లక్ష్యం
భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలి
ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
గురుకులంలో ఆకస్మిక తనిఖీ
నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశం
కాకతీయ, ఖమ్మం : విద్యార్థులు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ వద్ద ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల)ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల తరగతి గదులు, పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ మౌలిక సదుపాయాలు, వంటగది పరిశుభ్రత, ఆహార నాణ్యత, నిల్వ విధానాలను తనిఖీ చేశారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, కూరగాయలు, కోడిగుడ్లు తదితర సరుకులను పరిశీలించి రికార్డులను క్షుణంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కామన్ మెనూ ప్రకారం వండుతున్న అన్నం, కూరలను కూడా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ పాఠశాలలో కల్పిస్తున్న వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెస్ కమిటీ వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకొని, కమిటీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. తరువాత పదవ తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు మరో 9 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఈ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మనం ఎంతసేపు చదువుతున్నామన్నదికంటే ఎంత శ్రద్ధగా చదువుతున్నామన్నదే ముఖ్యమని తెలిపారు. ఉపాధ్యాయుల సహకారంతో పరీక్షలకు బాగా సిద్ధం కావాలని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. పదవ తరగతి ప్రధాన పరీక్షలకు ముందు ఎక్కువగా ప్రీ ఫైనల్ పరీక్షలు రాయాలని కలెక్టర్ తెలిపారు. ఎక్కువగా పరీక్షలు రాయడం వల్ల తుది పరీక్షల్లో ఒత్తిడి తగ్గి సులభంగా రాయగలమన్నారు. చదివిన దానికంటే రాసిన విషయాలు ఎక్కువగా గుర్తుంటాయని చెప్పారు. ఒత్తిడిని తగ్గించేందుకు శ్వాస వ్యాయామాలు, యోగా వంటి వ్యాయామాలు చేయాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు నిద్ర లేకుండా ఉండకూడదని, ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని తెలిపారు. బయట ఆహారం తీసుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుపై నమ్మకం ఉంచుకుని పరీక్షలకు హాజరైతే మంచి ఫలితాలు సాధించగలరని కలెక్టర్ పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షలు నెల రోజుల పాటు జరుగుతాయని, ఏకాగ్రతతో సిద్ధమైతే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి జ్యోతి, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.


