కాకతీయ, తెలంగాణ బ్యూరో: సమాజంలో ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి పార్ధసారధి చెప్పారు. మంగళవారం నగరంలోని ఎస్ ఎస్ కన్వెన్షన్ హాలులో ఎస్ & ఎస్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ-2025 సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి కొలుసు పార్ధసారధి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్ధసారధి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డీఎస్సీ అంటే అందని ద్రాక్ష పండులా ఉండేదని దానిని అందేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు.
మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో 16 వేల టీచర్ పోస్టులను సకాలంలో పారదర్శకంగా భర్తీ చేశారన్నారు. ఇందులో ఎక్కువగా ఎంపికైన వారు పేద కుటుంబాల నుంచి వచ్చిన వారై ఉంటారని నేను భావిస్తున్నానన్నారు. డీఎస్సీ లో ఉద్యోగం సాధించిన వారు ఎంతో బాధ్యతాయుతంగా ప్రభుత్వ స్కూల్స్ కు వచ్చే పేద విద్యార్థుల పిల్లలకు గుర్తుండే విధంగా విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.. స్కూల్లో పాఠాలు నేర్పించడం ఎంతో కష్ట సాధ్యమైన విషయం అని పాఠాలు చెప్పే వ్యక్తి కంటే విద్యార్థుల బ్రెయిన్స్ పది రెట్లు ఎక్కువుగా పనిచేస్తామని తెలిపారు. అలాంటి పిల్లలను సక్రమమైన దారిలో పెట్టి విద్యాబుద్దులు నేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. స్వర్ణాంధ్ర 2047 కు ప్రపంచంలో భారతదేశం నెంబర్ వన్ లాగా ఉండేలాగా విద్యార్థులను టీచర్ లు సన్నద్ధం చేయాలని పేర్కొన్నారు.
ఒకప్పుడు టీచర్ లు అంటే ఒక విధమైన భయం, గౌరవం ఉండేదని నేడు టీచర్ లు అంటే పరిస్థితి ఎలా ఉందో మనందరం చూస్తూనే ఉన్నామన్నారు. ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న గౌరవం విద్యార్థుల్లో కొంత తగ్గిందని, ఇది సమాజానికి ఆరోగ్యకరం కాదన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందని తెలిపారు. ఎప్పుడైతే ఉపాధ్యాయులు తమ వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా, సేవగా భావించి అంకితభావంతో పనిచేస్తారో అప్పుడే విద్యార్ధులు వారిని ఎంతో గౌరవిస్తారన్నారు. ఆలా కాకుండా సింప్లి సిటింగ్ అండ్ మంత్లీ టేకింగ్ లా ఉంటే వారికి సమాజంలో అంత గౌరవం ఉండదని తెలిపారు. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో 95 శాతం పేదవర్గాల పిల్లలే చదువుకుంటున్నారని అన్నారు. ఆ పిల్లల భవిష్యత్తు వారి తల్లితండులను కూడా తెలియదని వారికి తెలిసిందల్లా మా పిల్లవాడు బాగా చదువుకుని పట్టణంలో మంచి ఉద్యోగం చేసుకోవాలని ఆశిస్తారన్నారు. ఒకప్పుడు తమ పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు కావాలని తల్లిదండ్రులు కోరుకునేవారని, ఇప్పుడు ఐఏఎస్, ఐపిఎస్ కావాలని కోరుకుంటున్నారన్నారు. స్కూల్ దశలోనే విద్యార్ధులకు మంచి పునాది వేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని అందుకు నిదర్శనం మంత్రి నారా లోకేష్ విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు ఎన్నుకోవడమే అని తెలుసుకోవాలన్నారు. సూపర్ 6 లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ పై మొదటి సంతకం పెట్టారన్నారు. మెగా డీఎస్సీ పూర్తి కాకుండా ఋషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు ఆ యజ్ఞాలను పాడుచేసే విధంగా డీఎస్సీ పూర్తి కాకుండా ఉండడానికి ఎన్నో కేసులు వేశారన్నారు. అయినా మంత్రి నారా లోకేష్ అనుకున్న విధంగా మెగా డీఎస్సీ ని పూర్తి చేయడం గొప్ప విషయం అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ పిల్లవాడు చదువుకోవాలని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 67 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం అందించారన్నారు.
గతంలో ఇంటికి ఒకరికి ఇస్తే నేడు ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటుంటే అంత మంది పిల్లలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో చదువుకుంటున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు పెట్టుబడిదారులకు రాష్ట్రంలో అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. అమరావతి నగరాన్ని అమెరికాలో సిలికాన్ వ్యాలీ లాగా క్వాంటం వ్యాలీ లా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుని విద్యార్థులకు పాఠాలు నేర్పించటంలో సఫలీకఈతం కావాలని కోరారు. మెగా డీఎస్సీలో 50 శాతం ఉద్యోగాలు సాధించడంలో ఎస్ & ఎస్ పబ్లికేషన్స్ కృషి అనితర సాధ్యం అన్నారు. లాభా పేక్ష లేకుండా ఈ సంస్థను నిర్వహించడం చాలా గొప్పవిషయం అని మంత్రి కొలుసు పార్ధసారధి తెలియజేసారు.
ఎస్ & ఎస్ పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాకం శేషావలి మాట్లాడుతూ రాష్ట్రంలో మెగా డీఎస్సీ లో 50 శాతం కంటే పైన ఉద్యోగాలు సాధించడం మా సంస్థ పురోభివృద్ధికి నిదర్శనం అన్నారు. అంతే కాకుండా మా సంస్థ నుంచి రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మా సంస్థకు గర్వకారణం అని తెలిపారు. ఎన్నో రాష్ట్రస్థాయి ర్యాంకు లను స్వంతం చేసుకుని మా సంస్థ గౌరవాన్ని ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు కాపాడారన్నారు.
మెగా డీఎస్సీలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు పొందిన శ్రీకాకుళం జిల్లా కు చెందిన శేషాద్రి నాయుడు, విత్తనాల వంశీ కృష్ణ లకు రూ. 50,000 చెక్ లను మంత్రి పార్ధసారధి అందించారు. అదేవిధంగా ఎస్ & ఎస్ పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాకం శేషావలి కుటుంబాన్ని మంత్రి పార్ధసారధి సత్కరించారు.
కార్యక్రమంలో లో మాజీ శాసనమండలి సభ్యులు కె. లక్ష్మణ రావు, కే. శ్రీనివాస్, ఐపీఎస్, సైకాలజిస్ట్ నాగేశ్వరరావు, అంగలూరు డైట్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ ఎన్వీజీ ఆంజనేయులు, మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిని ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.


