“ప్రగతి ప్రణాళిక సమర్థవంతంగా నిర్వహించాలి”
•మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
కాకతీయ, రామకృష్ణాపూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం స్థానిక క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సూపర్ బజార్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్,శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్,ఏఈ ఆశ్రిత్ లతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 12 వ తేదీ వరకు 99 రోజుల పాటు రూపొందించిన కార్యాచరణను క్షేత్రస్థాయిలో,సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు.అలాగే పెండింగ్ ఫైళ్లను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని చెప్పారు. అనంతరం తొమ్మిదో వార్డులో అమృత్ పథకంలో భాగంగా చేపడుతున్న మంచినీటి వాటర్ ట్యాంక్ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.


