కోతులు భయపెడుతున్నాయి..
మందుబాబులు బెదిరిస్తున్నారు…
తాగునీటి కోసం గొంతులు ఎండుతున్నాయి..
ప్రజలు హాజరుకాని గ్రామసభ ఎందుకు…?
శ్రీనగర్ గ్రామసభలో లొల్లి.. లొల్లి
కాకతీయ, కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ..ప్రగతి ప్రణాళిక ద్వారా చేపడుతున్న 99 రోజుల కార్య చరణ ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టే అంశాలలో తొలిరోజు జిల్లావ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలలో నిర్వహించిన గ్రామసభ శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం పరిధిలోని శ్రీనగర్ గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభ అటు పూర్తిస్థాయిలో అధికారులు ప్రజలు హాజరు కాకపోవడంతో కొందరు ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గ్రామసభ ఏర్పాటు చేసి నేరుగా ప్రజల నుంచి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కార దిశగా ప్రయత్నం చేయాల్సిన అధికారుల సకాలంలో హాజరు కాకపోతే ప్రజల సమస్యలు ఎలా తెలుసుకుంటారని ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో కోతులు బెడద అధికంగా ఉందని వాటి ద్వారా నిత్యం ప్రజలకు అపాయం జరుగుతున్నప్పటికీ ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నం చేయడం లేదని ప్రజలు గ్రామ సభకు హాజరైన ప్రజాప్రతినిధులను వార్డు మెంబర్లను ప్రశ్నించారు.

శ్రీనగర్ పంచాయతీ ప్రక్కనే ఉన్న పల్లె ప్రకృతి వనం మందుబాబులకు అడ్డగా మారిందని సాయంత్రం రాత్రి వేళల్లో మందుబాబులు అక్కడికి చేరుకొని మద్యం సేవించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు పల్లె ప్రకృతికి ఆనుకుని ఉన్న పల్లె దావకాన సిబ్బంది మందుబాబుల్ని ప్రశ్నిస్తే తమపై దౌర్జన్యం చేస్తున్నారని బీరు బాటిల్లు విసిరి వేస్తున్నారని ఈ మందు బాబులు వలన ప్రతిరోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామసభలు సిబ్బంది ఫిర్యాదు చేశారు. పంచాయతీ పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు తాళాలు వేసి ఉన్నప్పటికీ కొందరు ఆకతాయిలు తాళాలు పగలగొట్టి అంగన్వాడి కేంద్రంలో ఉన్న కిచెన్ గార్డెన్ ను నాశనం చేస్తున్నారని సంబంధిత అంగన్వాడి సిబ్బంది గ్రామసభలో సర్పంచ్ ఎదుట మొర పెట్టుకున్నారు. శ్రీనగర్ పంచాయతీలో సుమారు 4వేల జనాభా కలిగి ఉందని కనీసం గ్రామ సభకు 50 మంది ప్రజలు హాజరు కాకపోతే ఈ గ్రామసభ ఎలా నిర్వహిస్తారని మాజీ వార్డ్ మెంబర్ అన్వర్ పాషా ప్రశ్నించారు.

శ్రీనగర్ పంచాయతీలో అధ్వానంగా డ్రైనేజీలు ఉన్నాయని వాటిని శుభ్రపరచుటలో పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. గ్రామ సభకు తప్పనిసరిగా ఆయా శాఖ అధికారులు హాజరై ప్రజల నుంచి అభ్యర్థనలను స్వీకరించి ఆ సమస్యకు పరిష్కారం చూపాలని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ తొలిసారిగా నిర్వహించిన గ్రామసభకు రెవెన్యూ విద్యుత్ ఫారెస్ట్ శాఖలు ఎందుకు హాజరు కాలేదని హాజరు గాని తదితర శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ సభకు హాజరు గాని శాఖ అధికారులకు నోటీసులు పంపుతామని చర్యలు నిమిత్తం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని గ్రామసభలో తీర్మానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతురాని ఉపసర్పంచ్ మద్దిపాటి కేశవరావు పంచాయతీ ఈవో వంశీ తదితరులు పాల్గొన్నారు.


