మక్కలు మక్కిపోతున్నాయి
– ప్రారంభం కానీ కొనుగోలు కేంద్రం
– అమ్ముకునే వీలు లేక రైతుల ఆందోళన
కాకతీయ, పెద్దవంగర :వరి తర్వాత మొక్కజొన్న రెండో ప్రధాన పంటగా సాగవుతోంది. మెట్ట ప్రాంతాలు, బోరులు, బావులు , కాల్వల కింద మొక్కజొన్న పంటను సాగు చేసి రైతులు యాసంగి సీజనలో ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఈ సీజనలో మండల పరిధిలో వందల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు కనిష్ఠంగా 30 క్వింటాళ్ల చొప్పున మూడు టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. మొక్కజొన్న కోతలు ప్రారంభించిన చోట వచ్చిన దిగుబడి పరిశీలించినా ఆ అంచనాలు మేరకు దిగుబడి వస్తున్నది. దళారుల చేతిలో మోసపోకూడదని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పడంతో రైతులు మక్కలను తెచ్చి ఒక దగ్గర ఉంచారు.మక్కలు మక్కిపోతున్నాయి తప్ప ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం లేదు. దీంతో మద్దతు ధర కంటే క్వింటాల్కు నాలుగు వందల నుంచి 500 రూపాయల తక్కువ ధరకే రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడిందని మండల పరిధిలోని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.వెంటనే మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి వెంటనే మక్కలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


