అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభం
రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
కాకతీయ, వరంగల్ సిటీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక పేద ప్రజలకు రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తున్నామని, రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, రేషన్ కార్డు మంజూరైన వారికి వెంట వెంటనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో రూ. 5 కోట్ల 87 లక్షల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అందులో జిడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘ, జనరల్ ఫండ్ నిధులు, ఎస్ ఎఫ్ సి పథకాల కింద రూ. 4 కోట్ల 87 లక్షల వ్యయం తోబల్దియా పరిధి 32 వ డివిజన్ బి ఆర్ నగర్ లో బస్తి దవాఖాన, ఎన్ ఎన్ నగర్ లో సిసి రోడ్లు, జ్యోతినగర్ లో సిసి రోడ్లు, అంబేడ్కర్ భవన్ కమ్యూనిటీ హాల్, బీరన్నకుంట కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు, 28వ డివిజన్ బట్టలబజార్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కిచెన్ షెడ్ 42వ డివిజన్ రంగశాయిపేట లో నిర్మించనున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పనులకు శంఖుస్థాపన చేశారు. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో కోటి రూపాయల వ్యయంతో మాషుఖ్ రబ్బానీ దర్గా లో చేపట్టే అభివృద్ధి పనులు ప్రారంభించారు. లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డు లు అందించారు. రంగశాయిపేట కమ్యూనిటీ హాల్లో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తుందన్నారు. గత ప్రభుత్వం రేషన్ ద్వారా దొడ్డు బియ్యం ఇచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక పేద ప్రజలకు రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. వరంగల్ మహా నగరాన్ని హైదరాబాద్ మాదిరిగా సమగ్ర అభివృద్ధి చేయుటకు గాను మామునూరు విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు ముందుకెళ్తున్నామని మంత్రి తెలిపారు. వరంగల్ నగరాన్ని ముంపు నుండి కాపాడేందుకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనవు కలెక్టర్ సంధ్యారాణి, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, కార్పొరేటర్లు, బల్దియా ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


