కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్న ప్రభుత్వం
: సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య
కాకతీయ, హనుమకొండ : కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసి) మెన్స్, ఉమెన్స్ హాస్టళ్లలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న 86 మంది కార్మికులకు ఎనిమిది నెలలుగా వేతనాలు బకాయిగా ఉన్నాయని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య ఆరోపించారు. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు తొమ్మిది రోజులుగా చేస్తున్న సమ్మె భాగంగా బుధవారం ఏకశిలా పార్క్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తిరిగి ఏకశిలా పార్క్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం, మెడికల్ కాలేజీ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. టెండర్లు పిలిచే ముందు కార్మికుల వేతనాలు సకాలంలో చెల్లించేలా నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కాంట్రాక్టర్ వెంటనే బకాయిలు చెల్లించాలన్నారు. జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థులు అసౌకర్యం ఎదుర్కొంటున్నారని, కానీ కార్మికులు వేతనాల కోసం రోడ్డు ఎక్కితే ప్రజా ప్రతినిధులు నిశ్శబ్దంగా ఉండటం దురదృష్టకరమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్, తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లపెల్లి సుధాకర్, నాయకులు అల్లం రమేష్, రాణి, రాజకుమారి, ఎం.డి. అతిక్, రాము, మంద కవిత, రవి, బాబు, శశి, సుమన్, వంశీ, ప్రశాంత్, సునీత తదితరులు పాల్గొన్నారు.


