గ్రామ అభివృద్ధియే ధ్యేయం
సర్పంచ్ కనుకుంట్ల మంజుల అశోక్
కాకతీయ,రాయపర్తి :మండలంలోని అన్ని గ్రామాలు ఇప్పుడు అభివృద్ధితో పరుగులు పెడుతున్నాయి…గత కొంతకాలంగా పాలకవర్గం లేక,సరైన పర్యవేక్షణ కరువై కుంటుపడిన అభివృద్ధి పనులకు సర్పంచుల రాకతో పల్లె ప్రగతి పరుగులు పెడుతోంది.తాజాగా బుధవారం కొండాపూరం గ్రామంలో ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద నూతనంగా మంజూరైన రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ కనుకుంట్ల మంజుల అశోక్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధియే ధ్యేయం అని స్పష్టం చేసారు. గ్రామంలో అంతర్గత రహదారుల అభివృద్ధికి తాము పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకుంటూ,గ్రామంలో ఎక్కడా బురద రోడ్లు లేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు.గ్రామంలో మౌలిక సదుపాయాలకు కృషి చేస్తామని,ప్రభుత్వ నిధులను నేరుగా ప్రజల అవసరాల కోసం ఖర్చు చేస్తూ, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎనగందల మురళి,గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి నరేంద్రరావు,కార్య నిర్వహక అధ్యక్షుడు ఖదీర్,వార్డు సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.


