సమస్యల పరిష్కారమే లక్ష్యం
ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం
మున్సిపల్ చైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్
కాకతీయ, నర్సంపేట టౌన్: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మున్సిపల్ చైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ శుక్రవారం పర్యటించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు స్థానిక కౌన్సిలర్ కాంపెల్లి వీణ విజేందర్ రెడ్డి తో కలిసి వార్డులోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. పర్యటన అనంతరం చైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వార్డులో పర్యటించే సమయంలో స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ప్రతి వార్డును సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. త్వరలోనే బావులు, బోర్ల ద్వారా ప్రజలకు తాగునీటిని అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన చోట సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. వార్డుల్లో ఎక్కడ సమస్య ఉన్నా అధికారులు వెంటనే స్పందించి తమ దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాట భాస్కర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్యామ్, 3వ వార్డు కౌన్సిలర్ ముత్తినేని వెంకన్న, 4వ వార్డు కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి, వాటర్ సప్లై ఇంచార్జ్ కాట శ్రీనివాస్, వార్డు ఆఫీసర్ యుగంధర్, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు వేముల నవీన్, చిదురాల రాంరెడ్డి, దూపటి కుమార్, కేశపాక సాంబయ్య, ఎండీ రజాక్, రహీం తదితరులు పాల్గొన్నారు.


