రైతులకు తగిన రుణాలే లక్ష్యం
సాగు వ్యయాల పెరుగుదలకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్
వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు నగదు పంటలకూ అధిక పరిమితి
రైతుల పెట్టుబడి–ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి
బ్యాంకర్లు సమన్వయంతో ముందుకు రావాలి
కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్
కాకతీయ, కరీంనగర్ : రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు తగిన స్థాయిలో రుణాలు అందించాల్సిన అవసరం ఉందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్ స్పష్టం చేశారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారుపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో పంటల సాగు వ్యయాలు గణనీయంగా పెరిగాయని, అందువల్ల గత ఏడాదితో పోలిస్తే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను సముచితంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు గోధుమలు, కూరగాయలు, చిరుధాన్యాలు, జొన్న, రాగులు, నగదు పంటలకు అధిక రుణ పరిమితి కల్పించాలని సూచించారు. రైతుల పెట్టుబడి, ఆదాయం, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలని బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
రైతుల అభిప్రాయాలు.. సమగ్ర చర్చ
సమావేశంలో రైతులకు రుణాల మంజూరు విధానం, ఫైనాన్సింగ్ ప్రక్రియలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆయా పంటల సాగులో పెట్టుబడులు, ఆదాయం, వ్యయాలపై వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు వివరాలు సమర్పించారు. ఈ సందర్భంగా 20 మంది రైతులు సమావేశంలో పాల్గొని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంపుపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ సత్యనారాయణ రావు, కరీంనగర్ ఎల్డీఎం ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల నాబార్డ్ అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు, కేడీసీసీబీ అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.


