మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం
మంత్రి కొండా సురేఖ
శివ నగర్లో కుట్టు మిషన్ల పంపిణీ
35వ డివిజన్లో స్వచ్ఛత కార్యక్రమం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం శివ నగర్లోని సాయి కన్వెన్షన్ హాల్లో ‘ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా శక్తి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… మహిళా శక్తిని వెలికితీసేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా మైనారిటీ మహిళలు స్వయం ఉపాధి పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డా. సత్య శారద, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, గుండు చందన, పోశాల పద్మ, సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్లో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. మేయర్, కలెక్టర్తో కలిసి స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వయంగా పరిసరాలను శుభ్రం చేసి ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని మంత్రి సూచించారు. నగరంలో పారిశుధ్య పనులు మరింత మెరుగుపడాలని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కేవలం అధికారుల బాధ్యతే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


