ఫైనాన్స్ మాఫియాకు అడ్డుకట్ట వేయాలి
సామాన్యులను దోచుకుంటున్న వడ్డీ వ్యాపారులు
అక్రమ చిట్టీ బిజినెస్లో బడా బాబుల దందా
ఏజెన్సీ ప్రాంతంలో పెరుగుతున్న ఆర్థిక దోపిడీ
తక్షణ చర్యలు తీసుకోవాలని అక్షర మహిళా మండలి డిమాండ్
కాకతీయ, మణుగూరు: ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరు పరిధిలో అక్రమ ఫైనాన్స్ మాఫియా రోజురోజుకూ విస్తరిస్తోందని, వడ్డీ వ్యాపారుల ఆర్థిక దాహానికి పేద, మధ్యతరగతి ప్రజలు బలవుతున్నారని రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ ఆరోపించారు. గురువారం మణుగూరులో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్థానికంగా కొంతమంది బడా బాబులు అనుమతులు లేకుండానే ఫైనాన్స్ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారని తెలిపారు. పట్టణంలోనే కోటి నుంచి అరకోటి రూపాయల వరకు అక్రమ చిట్టీలు నడుస్తున్నాయని ఆరోపించారు.
అధిక వడ్డీల భారం
నూటికి ఆరు రూపాయల నుంచి పది రూపాయల వరకు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజల అత్యవసర అవసరాలను పెట్టుబడిగా మార్చుకుని వడ్డీ వ్యాపారులు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నారని అన్నారు. గ్రామాల నుంచి పట్టణాల దాకా అక్రమ ఫైనాన్స్ దందా విస్తరించిందని, అప్పుల బారిన పడిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
చిట్టీ దందాలో బాహ్య వ్యక్తుల హస్తం
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు రోజువారీ, వారాంత, వంద రోజుల ఫైనాన్స్ పేరుతో వివిధ రకాల అక్రమ వడ్డీ వ్యవహారాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై సంబంధిత శాఖలు సమగ్ర విచారణ చేపట్టి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో సాగుతున్న అక్రమ ఫైనాన్స్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలని, బాధితులకు రక్షణ కల్పించాలని సరోజ కోరారు.
ఈ సమావేశంలో రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు ఎండి షబానా, కోరి శ్యామల, బొడ్డు సౌజన్య, కన్నాపురం వసంత, కన్నాపురం శైలజ, డేరంగుల సుజాత, రెడ్డిబోయిన రేణుక, లక్కింశెట్టి హేమలత తదితరులు పాల్గొన్నారు


