ఆదివాసీ హక్కుల కోసం పోరాటం కొనసాగాలి
తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొరగట్ల లక్ష్మణ్ రావు
కాకతీయ, ఏటూరునాగారం : ఆదివాసీ హక్కుల సాధన కోసం చట్టాలు, జీవోలు అమలు చేయించుకునే దిశగా పోరాటం కొనసాగించాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొరగట్ల లక్ష్మణ్ రావు పిలుపునిచ్చారు. సంఘటితంగా ముందుకు రావాలని సూచించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ ఆవరణలో పోడెం శోభన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నల్లెబోయిన లక్ష్మణ్ దొర మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఉద్యమాన్ని బలోపేతం చేయాలని అన్నారు. మండలంలోని 12 గ్రామపంచాయతీల నుంచి నాయకులు కమిటీ ఎన్నికలకు హాజరుకావాలని కోరారు. ఏటూరునాగారం మండల కమిటీ ఎన్నికలను చిన్నబోయినపల్లి గ్రామంలో 12-04-2026న నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కోరేం మొగిలి, సోయం ఈశ్వరయ్య, యాలం దేవేందర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


