చైర్పర్సన్ ఎన్నిక సజావుగా జరగాలి
మునిసిపాలిటీ వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు
బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్
కాకతీయ, రామకృష్ణాపూర్ : క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నామని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించామని చెప్పారు. శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణంలో 144 సెక్షన్ బీఎన్ఎస్ఎస్ 163 అమల్లో ఉంటుందని, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని పేర్కొన్నారు. మొత్తం 4 ఏసీపీలు, 25 సీఐలు, 50 మంది ఎస్సైలు, 600 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆర్వోబీ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ మార్పులు అమలు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై జాడి శ్రీధర్ తెలిపారు. రాజీవ్ చౌక్, అమరవాది, రాజీవ్ నగర్ మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నట్లు చెప్పారు. గద్దె రాగడి, క్యాతన్ పల్లి, తిమ్మాపూర్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పరోక్ష ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని అదనపు కలెక్టర్ పీ. చంద్రయ్య తెలిపారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.


