ఎస్జీటీ పోస్టుల రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
గ్రామీణ విద్యపై తీవ్ర ప్రభావం
ప్రభుత్వానికి టీఈఏ నేత ఖాద్రీ విజ్ఞప్తి
కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వ పాఠశాలల్లో కీలకమైన ఎస్జీటీ పోస్టులను రద్దు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన విద్యారంగానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ) ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలల్లో హెడ్మాస్టర్, పీఈటీ పోస్టుల అవసరం పేరుతో ఇప్పటికే మంజూరైన 2325 ఎస్జీటీ పోస్టులను రద్దు చేయాలన్న ప్రతిపాదన పూర్తిగా అశాస్త్రీయమని ఆయన విమర్శించారు. కొత్తగా అవసరమైన 2064 పోస్టులను సృష్టించకుండా, ప్రాథమిక విద్యకు వెన్నెముకలాంటి ఎస్జీటీ పోస్టులను తొలగించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ఈ నిర్ణయం అమలైతే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు తీవ్ర సంక్షోభంలో పడతాయని ఖాద్రీ హెచ్చరించారు. ఇప్పటికే అనేక ప్రాథమిక పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఉందని, ఇలాంటి తరుణంలో పోస్టులు తగ్గించడం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఎస్జీటీ ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యా వ్యవస్థకు మూలస్తంభాలని, గత మూడు దశాబ్దాలుగా వారికి సరైన ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ చేసిన ప్రతిపాదనలపై ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయాలని కోరారు. హైస్కూళ్లకు అవసరమైన పోస్టులను ప్రత్యేకంగా మంజూరు చేయాలని, ప్రైమరీ స్కూళ్ల పోస్టులను తగ్గించడం సరికాదని స్పష్టం చేశారు. విద్యారంగాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఖాద్రీ విజ్ఞప్తి చేశారు.


