పేదోడి కళ్ళల్లో సంతోషం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
– అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరి చేస్తాం
– మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి
కాకతీయ, గజ్వేల్ : పేదవాడి కళ్ళల్లో సంతోషం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కాగా, అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరీ చేస్తామని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో ఇందిరమ్మ ఇంటిని గృహప్రవేశం చేయించిన సందర్భంగా ఆయన ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, నేతలు ఊడేo సారిక శ్రీనివాస్ రెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ షరీఫ్తో కలిసి మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గానికి 35 వందల ఇండ్లను మంజూరు చేయగా, అందులో 80 శాతం లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సైతం లబ్ధిదారుల ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వెంట వెంటనే బిల్లులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. సొంత స్థలం ఉన్న నిరుపేదలు నేరుగా తమను సంప్రదిస్తే ఇందిరమ్మ ఇల్లు మంజూరి చేస్తామని పేర్కొన్నారు. అంతేగాకుండా ప్రతి పేదకి రేషన్ కార్డు మంజూరి చేయడంతో పాటు సన్న బియ్యం అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం రూ 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు 200ల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రూ 500లకే వంట గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తోందని అన్నారు. గజ్వేల్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత మేర నిధులు సాధిస్తూ వివిధ పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, నేతలు నాయిని యాదగిరి, గుంటుకు శ్రీనివాస్, నక్క రాములు గౌడ్, సమీర్, గాడిపల్లి శ్రీనివాస్, రామరాజు, గుండు లక్ష్మణ్, నేత నాగరాజు, సురేష్ పాల్గొన్నారు.



