మక్క రైతులను రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
కొనుగోలు కేంద్రాలు పెంచకపోతే ఆందోళనలు తప్పవు
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
కాకతీయ,ఖానాపూర్ : రాష్ట్రంలో మక్కజొన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, వారి కష్టాలను పట్టించుకోకుండా రోడ్డున పడేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఖానాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నర్సంపేట నియోజకవర్గంలో ఈ యాసంగి సీజన్లో 70 వేల ఎకరాలకు పైగా మక్కజొన్న సాగు జరిగినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఘోరంగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. మద్దతు ధర 2400 ప్రకటించి రైతులను మోసం చేసిన ప్రభుత్వం చివరికి వారిని 1700–1800కే మక్కలు అమ్ముకునే పరిస్థితికి నెట్టేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రైతుకైనా చెల్లింపులు చేయలేదని విమర్శించారు.
రైతుల కష్టాలపై స్పందన లేదు
పాకాల ఆయకట్టు కింద వరి పంటలు ఎండిపోతున్నా స్థానిక ఎమ్మెల్యే, అధికారులు కళ్లెదుట జరుగుతున్న రైతుల కష్టాలపై స్పందించకపోవడం దారుణమన్నారు. సరస్సులో నీళ్లు ఉన్నా రైతులకు అందించలేని పరిస్థితి ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఒకటి రెండు కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తోందని, మండల కేంద్రాల్లో మాత్రమే కేంద్రాలు పెట్టి గ్రామీణ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. వాతావరణ శాఖ వర్షాల హెచ్చరికలు జారీ చేస్తున్న వేళ వెంటనే అన్ని గ్రామాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే రైతులు తీవ్ర నష్టపోతారని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రలేచి రైతుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలబడి ఆందోళనలు, ధర్నాలు చేపడుతుందని, ఆ పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కఠినంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


