గ్రామీణ ప్రతిభకు తెలంగాణ క్రీడా శాఖ అండ
జిల్లా క్రీడా, యువజన సంక్షేమ అధికారిణి జ్యోతి
జాతీయ స్థాయి అథ్లెట్లకు ప్రత్యేక స్పోర్ట్స్ కిట్ల పంపిణీ
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికి తీసి ప్రోత్సహించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చర్యలు చేపడుతోందని జిల్లా క్రీడా, యువజన సంక్షేమ అధికారిణి జ్యోతి తెలిపారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లాకు చెందిన జాతీయ స్థాయి అథ్లెట్ క్రీడాకారులకు ప్రత్యేక స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ క్రీడాకారుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఐఏఎస్, స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవి ఐఎఫ్ఎస్ సహకారంతో క్రీడా సామాగ్రి అందజేయడం జరిగిందన్నారు. ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా సీఎం కప్ స్పెషల్ ఆఫీసర్ నందకిషోర్ గోకుల్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మార్గదర్శకత్వంలో క్రీడల అభివృద్ధికి విశేష కృషి జరుగుతోందన్నారు. జాతీయ స్థాయిలో మరింత మెరుగ్గా రాణించేందుకు స్పోర్ట్స్ కిట్లు అందించడం ఉత్సాహాన్ని కలిగించిందని క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యువజన సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


