కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణను ప్రపంచానికి ‘ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్’గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైటెక్ సిటీలో అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ జాగర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఆయన బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ అన్ని రంగాలకు చెందిన గ్లోబల్ కంపెనీలకు ప్రాధాన్య గమ్యస్థానమైంది. ఇప్పుడు జాగర్ కూడా ఈ జాబితాలో చేరడం రాష్ట్ర బ్రాండ్ ను మరింతగా ప్రపంచానికి పరిచయం చేస్తుందన్నారు. ఈ కేంద్రం ద్వారా కొత్తగా 180 మందికి ఉపాధి లభించగా, త్వరలో అది 500కు పెరుగుతుంది అన్నారు. జాగర్ ఏఐ ప్లాట్ఫాం, ప్రొక్యూర్మెంట్ పరిష్కారాల అభివృద్ధికి ఈ జీసీసీ వ్యూహాత్మక కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు.
సాఫ్ట్వేర్, క్లౌడ్ ఆపరేషన్ సేవలను ప్రపంచవ్యాప్తంగా తయారీ, విద్య, ఎఫ్ఎంసీజీ, రిటైల్ వంటి రంగాలకు అందిస్తుందని వివరించారు. హైదరాబాద్ జీసీసీలకు అనుకూల కేంద్రంగా మారిందని, గత ఏడాదిలోనే 70 జీసీసీలు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది మరో 100 జీసీసీలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
ఏఐ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలపడానికి ప్రత్యేకంగా ఏఐ సిటీ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ యూనివర్సిటీ, ఏఐ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో జాగర్ సీఈఓ ఆండ్రూ రోస్కో, చీఫ్ డిజిటల్ అండ్ ఏఐ ఆఫీసర్ గోపీనాథ్ పోలవరపు, చీఫ్ కస్టమర్ ఆఫీసర్ ట్రాయ్ మేయర్ తదితరులు పాల్గొన్నారు.


