అడవుల సంరక్షణతోనే సుస్థిర భవిష్యత్తు
ప్రాణవాయువుకు అడవులే ప్రధాన ఆధారం
మంత్రి సీతక్క పంచాయతీరాజ్ శాఖ
కాకతీయ, ములుగు ప్రతినిధి : అడవుల సంరక్షణతోనే సుస్థిర భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. స్వచ్ఛమైన ప్రాణవాయువుకు అడవులే ప్రధాన మూలాధారమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అడవులను కాపాడాలని పిలుపునిచ్చారు. ఆదివారం గోవిందరావుపేట మండలం పస్రా అటవీ శాఖ కార్యాలయంలో ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో మంత్రి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాగా నిలిచిందని మంత్రి తెలిపారు. పంటల దిగుబడులు, వర్షపాతం, పర్యావరణ సమతుల్యతకు అడవులు కీలకమని చెప్పారు. అడవులు లేకపోతే మానవ మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. గిరిజనులకు ఉపాధి అవకాశాలు కూడా అడవుల ద్వారానే లభిస్తున్నాయని వివరించారు. వేసవి కాలంలో అడవులకు నిప్పు పెట్టడం, చెట్లను నరికి వేయడం, వన్యప్రాణులను వేటాడడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ అడవుల విస్తీర్ణం పెంపుతో గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను తగ్గించవచ్చని తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలంటే అడవుల రక్షణ అత్యవసరమని అన్నారు. డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ మాట్లాడుతూ అడవుల రక్షణలో అటవీ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సూచించారు. అడవులకు హాని చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి పసర గ్రామంలో రూ.35 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ ప్రారంభమవుతుందని, అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అటవీ శాఖ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.


