సురేష్ కల్మాడీ కన్నుమూత
తీవ్ర అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస
యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలు
కల్మాడి మృతిపై మోదీతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు, క్రీడా ప్రముఖులు సంతాపం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: భారత రాజకీయాల్లో, క్రీడా పాలనా విభాగంలో దశాబ్దాలపాటు తిరుగులేని నాయకుడిగా వెలిగిన సురేష్ కల్మాడీ (81) ప్రస్థానం ముగిసింది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున పుణేలో కన్నుమూశారు. దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త పుణేతోపాటు జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా కెరీర్ ప్రారంభించి.. కేంద్ర మంత్రిగా ఎదిగిన కల్మాడీ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా పుణే నగరాన్ని ఆధునిక అభివృద్ధి బాటలో నడిపించడంలో ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని సంతాపం వ్యక్తం చేశారు ఆయన అభిమానులు. మహారాష్ట్రలోని పుణేను తన రాజకీయ కేంద్రంగా చేసుకున్న సురేష్ కల్మాడీ.. ఆ నగరాన్ని ఆధునిక అభివృద్ధి పథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. 1977లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. పుణే లోక్సభ నియోజక వర్గం నుంచి పలుమార్లు ఎంపీగా ఎన్నిక అయ్యారు. మాజీ ప్రధాని పి.వి. నరసింహా రావు హయాంలో (1995-96) కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ముంబైలోని ఐకానిక్ విక్టోరియా టెర్మినస్ను ఛత్రపతి శివాజీ టెర్మినస్గా మార్చడంలో ఆయన చూపించిన చొరవను స్థానిక ప్రజలు నేటికీ గుర్తు చేసుకుంటారు. అలాగే రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన సుదీర్ఘ కాలం సేవలు అందించారు.
క్రీడా రంగంలో రారాజుగా..
రాజకీయాల కంటే క్రీడా నిర్వాహకుడిగానే కల్మాడీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 1996 నుంచి 2011 వరకు సుదీర్ఘ కాలం పని చేశారు. ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించారు. అయితే 2010లో ఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో తలెత్తిన అవినీతి ఆరోపణలు ఆయన కెరీర్ను ఊహించని మలుపు తిప్పాయి. ఈ కేసులో ఆయన తీహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇటీవలే (ఏప్రిల్ 2025) ఢిల్లీ కోర్టు మనీ లాండరింగ్ కేసులో ఆయనకు క్లీన్ చిట్ ఇస్తూ కేసును క్లోజ్ చేసింది. సురేష్ కల్మాడీ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం మహారాష్ట్ర ఎరందవనేలోని ఆయన నివాసం కల్మాడీ హౌస్లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు నవీ పేటలోని వైకుంఠ స్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కల్మాడీకి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, మనవలు ఉన్నారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


