వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
కలెక్టర్ డాక్టర్ సత్య శారద
పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రికార్డుల నిర్వహణను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ తొలుత ఆసుపత్రిలోని ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. అనంతరం ఔషధ నిల్వలను పరిశీలించి, రోగులకు మందుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణను కలియతిరిగిన కలెక్టర్ , పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంచాలని, విధుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని సహించబోమని సిబ్బందిని హెచ్చరించారు. ప్రజల్లో వివాహ వయస్సుపై అవగాహన కల్పించాలని, బాల్య వివాహాలను నిరోధించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రమాదకరంగా ఉన్న పాత భవనాలను నిబంధనల ప్రకారం అనుమతులు పొంది వెంటనే తొలగించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పారిశుధ్య పనులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను సమయానుకూలంగా సాదించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. సాంబశివరావు, స్థానిక సర్పంచ్ చిదురు శంకర్, వైద్యాధికారులు డాక్టర్ ఉదయ్ రాజ్, డాక్టర్ మౌనిక, రెవెన్యూ, పంచాయతీరాజ్ మరియు ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.


