పోలీసులపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు
చందుర్తి ఎస్సై రమేష్
కాకతీయ, వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి నివేదిక కార్యక్రమం సందర్భంగా చందుర్తిలో చోటుచేసుకున్న పరిణామాలపై స్థానిక పోలీసులు స్పష్టతనిచ్చారు. పోలీసులపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలను చందుర్తి సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ మైలేజ్ కోసం, వ్యక్తిగత పబ్లిసిటీ కోసం పోలీసు వ్యవస్థను అప్రతిష్ట పాలు చేసేలా వ్యవహరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చందుర్తి ఆరో వార్డు సభ్యుడు మర్రి రమేష్ సోషల్ మీడియా గ్రూపుల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు విషయంపై అన్ని కుల సంఘాల సభ్యులు గుమిగూడాలని పోస్ట్లు షేర్ చేశారు. స్టేషన్ నేమ్ బోర్డు కనిపిస్తూ, పోలీసులను అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఇకపై పోలీస్ స్టేషన్ను వేదికగా చేసుకుని, పోలీసులపై అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ఎస్సై స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని, వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ఆయన సూచించారు.


