గ్రామసభలతో ప్రజా పాలన బలోపేతం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
జూన్ 2 నుంచి ‘ఇందిరమ్మ జీవిత బీమా’ అమలు
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రంలో ప్రజా పాలనను ప్రజలకు చేరువ చేసే దిశగా గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమం అమలుపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ కే. రామకృష్ణారావు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామసభల్లో ప్రజలకు అందించే సమాచారం ఒకే విధంగా ఉండాలని, ప్రభుత్వ ఉద్దేశాలు స్పష్టంగా వివరించాలని చెప్పారు. గ్రామసభలకు వార్డు సభ్యుల నుంచి ఎంపీ, మంత్రుల వరకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. ముఖ్యమంత్రి సందేశంతో గ్రామసభలు ప్రారంభించాలని, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లు గ్రామంలో ప్రకటించాలని తెలిపారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, గిరిజన రైతులకు ఉచిత పంపుసెట్లు వంటి పథకాలపై లబ్ధిదారుల అనుభవాలు ప్రజలకు తెలియజేయాలని అన్నారు. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారంతో పాటు పాలు లేదా రాగి జావా అందించే కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రజల నుంచి వచ్చే సానుకూల అభిప్రాయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పథకాలపై అవగాహన పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి విడుదల చేసిన నిధులను సమర్థంగా వినియోగించాలని తెలిపారు.
గ్రామసభలకు మంచి స్పందన
సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ మార్చి 6 నుంచి 15 వరకు నిర్వహించిన పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, పారిశుద్ధ్య కార్యక్రమాలకు మంచి స్పందన లభించిందన్నారు. అదే ఉత్సాహంతో ఏప్రిల్ 2న గ్రామసభలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
ప్రతి జిల్లాలో గ్రామసభల నిర్వహణపై నివేదికలు సమర్పించాలని, ప్రజల భాగస్వామ్యం పెరగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు తెలియజేయడంతో పాటు సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను వివరించాలని సూచించారు.
అలాగే సాగు పద్ధతుల్లో మార్పులు, పంట మార్పిడి, యూరియా వినియోగం తగ్గింపు, ఆర్గానిక్ వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. గ్రామసభల తరహాలో మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని, ప్రజల అభిప్రాయాలను రికార్డు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో శ్రీనివాస్, డీపీఓ జగదీశ్వర్, డీఆర్డీఓ శ్రీధర్, వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


