క్వారీల్లో అదనపు వసూళ్లను అరికట్టండి
టీజీఎండీసీ ఎండీ భవేశ్ మిశ్రాకు లారీ అసోసియేషన్ నేతల ఫిర్యాదు
బ్రాహ్మణపల్లి ఘటనపై క్వారీ నిర్వాహాకులపై చర్యలకు డిమాండ్
కాకతీయ, హైదరాబాద్ : ఇసుక క్వారీల్లో కాంట్రాక్టర్లు అక్రమంగా వసూలు చేస్తున్న లోడింగ్ చార్జీలను నియంత్రించాలని లారీ అసోసియేషన్ నేతలు సోమవారం టీజీఎండీసీ ఎండీ భవేశ్ మిశ్రాకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని పేర్కొంటూ తమ నుంచి ఒక్కో లారీ లోడింగ్కు రూ.1700 నుంచి 2500 వరకు వసూలు చేస్తున్నారని ఎండీ ఎదుట అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ఏకంగా రూ.5000లకు పైగా ఈ మొత్తాలను వసూలు చేశారని అన్నారు. లోడింగ్కు డబ్బులు ఇవ్వకుంటే లారీ డ్రైవర్లపై సూపర్వైజర్లు, లోడింగ్ చేస్తున్న సిబ్బందితో కలిసి కాంట్రాక్టర్లు తెగబడుతున్నారని అన్నారు. భూపాలపల్లి జిల్లి మహేదేవ్పూర్ మండలం బ్రాహ్మణపల్లి ఇసుక క్వారీ-2లో ఆదివారం ప్రవీణ్ అనే లారీ డ్రైవర్పై దాడి చేసిన ఘటనను గుర్తు చేశారు. లోడింగ్ చేయలేదన్న విషయం ఓనర్కు తెలిపేందుకు వీడియో తీస్తున్న ప్రవీణ్పై ముగ్గురు సిబ్బంది దాడి చేయడంతో పాటు చెప్పలేని మాటలతో తిట్టారని, ఈ ఘటనలో ప్రవీణ్కు గాయాలయ్యాయని గుర్తు చేశారు. టీజీఎండీసీ మహదేవ్పూర్ ప్రాజెక్టు ఆఫీసర్ రామకృష్ణ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినా పట్టించుకోలేదని అసోసియేషన్ నాయకులు ఆరోపించారు. కాంట్రాక్టర్ల నుంచి తమకు వేధింపులు ఎక్కువవుతూ ఉన్నాయని, ఈ పరిస్థితిలో మార్పు రాకుంటే టీజీఎండీసీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని అవసరమైతే ఇసుక సరఫరాను రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయేలా బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు.
సానుకూల స్పందన..!
లారీ అసోసియేషన్ నేతలు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఎండీ భవేశ్మిశ్రా..నేతల ఆరోపణలపై క్షేత్రస్థాయి అధికారులతో ఆరా తీశారు. వెంటనే విచారణ జరిపించేలా ఆదేశాలు జారీ చేస్తామని ఎండీ వెల్లడించినట్లుగా అసోసియేషన్ నాయకులు వెల్లడించారు.


