ఆత్మీయ అనుబంధాలు మాయం
మనుషుల మధ్య పెరుగుతున్న వైషమ్యాలు
ప్రేమానురాగాల కంటే సంపాదనపైనే మోజు
ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమవడమే కారణం
మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటన
ప్రజలతో ముఖాముఖి..
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఆధునిక యుగంలో నింగికి శాటిలైట్లు పంపుతున్నప్పటికీ, మనిషి కుటుంబ బంధాలను కాపాడుకోవడంలో వెనుకబడిపోతున్నాడని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నదగడ గ్రామస్థులతో ముచ్చటించిన సందర్భంగా ఆయన సమాజంలో పెరుగుతున్న అంతరాలు, రైతు సమస్యలు, యువత పెడ ధోరణి, ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. నాడు తండ్రి మాట కోసం, తమ్ముడు భరతుని క్షేమం కోసం శ్రీరాముడు సంతోషంగా అడవుల బాట పట్టాడని, కుటుంబ గౌరవం కోసం త్యాగాలకు వెనుకాడని గొప్ప సంస్కృతి మనదని మంత్రి గుర్తు చేశారు. కానీ నేడు.. ఆత్మీయ అనుబంధాలు కనుమరుగవుతున్నాయని, ప్రేమానురాగాల కంటే సంపాదనపై మోజు పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తి కోసం, స్వల్ప లాభాల కోసం తోడబుట్టిన వారి మధ్యే ద్వేషాలు పెరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.
ఆత్మహత్యలకు అదే కారణం
నేడు సమాజంలో ఆత్మహత్యలు పెరగడానికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం కూడా కారణమేనని మంత్రి అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ఇంట్లో పెద్ద దిక్కు ఉండేవారు. కష్టమొస్తే పంచుకోవడానికి, కష్ట సుఖాల్ని పంచుకోవడానికి మనుషులు ఉండేవారు. నేడు ఏకాకి జీవితాల వల్ల, చిన్న సమస్య ఎదురైనా తట్టుకోలేక, చర్చించే వారు లేక ఆత్మహత్యల వైపు మళ్లుతున్నారని పేర్కొన్నారు.
అప్పుల బాధ, చిన్నపాటి మనస్పర్థలు ప్రాణాలు తీసుకునేంత పెద్దవి కావని, అందరూ కలిసి ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని ఆయన గ్రామస్తులకు హితోపదేశం చేశారు. మనం నింగిలోకి శాటిలైట్లను పంపుతూ అంతరిక్షాన్ని జయిస్తున్నాం.. కానీ, అదే ఆధునిక కాలంలో నదీ జలాలను పక్కనే ఉన్న పంట పొలాలకు మళ్లించలేకపోతున్నాం అని మంత్రి శాస్త్రీయ ప్రగతికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య ఉన్న అంతరాన్ని ఎత్తి చూపారు. రైతులకు భరోసా అందించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. సమాజంలో కుటుంబ, నైతిక విలువలు క్షీణించే కొద్దీ సామాజిక సంఘర్షణ, సామాజిక అశాంతి పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. అందువల్ల సమాజంలో నెలకొన్న అనేక సామాజిక రుగ్మతలను రూపుమాపి ప్రజల్లో వాటిపై అవగాహన కల్పించేందుకు ప్రభాతభేరి అనే సామాజిక చైతన్య కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు.
ప్రజలతో ముఖాముఖి
కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నదగడ, అమ్మాయిపల్లి గ్రామాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై మంత్రి స్థానిక అధికారులు, ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ప్రజలు తమ గ్రామ సమస్యలను మంత్రికి వివరించారు.
వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నాణ్యతలో ఎలాంటి రాజీ పడవద్దని సూచించారు. సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడంలో అధికారులు చురుకుగా వ్యవహరించాలని మంత్రి జూపల్లి సూచించారు.



