క్షమించు రామన్న… ఈసారి మా ఓటు కారుకు కాదు!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరపత్రం
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : మున్సిపల్ ఎన్నికల వేళ సిరిసిల్ల పట్టణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ “క్షమించు రామన్న… ఈసారి మా ఓటు కారుకు దూరమవుతోంది” అనే శీర్షికతో ఓ కరపత్రాన్ని గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ కరపత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. కరపత్రంలో బీఆర్ ఎస్ పార్టీపై పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో భారీగా కమీషన్లు, పర్సెంటేజీల రాజకీయాలు నడిచాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ కారు గుర్తుపై ఓటు వేయడం తమకు సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొందరు నాయకులు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలపై పెత్తనం చెలాయించారని, బీసీ, దళిత, మైనారిటీ వర్గాల నేతలను అవమానించారని ఆరోపించారు. సిరిసిల్లను ప్రజాస్వామ్య నియోజకవర్గంగా కాకుండా కొందరి వ్యక్తిగత జాగీరుగా మార్చేశారని కరపత్రంలో పేర్కొనబడి ఉంది. బతుకమ్మ చీరల కాంట్రాక్టులు, రాజకీయ నేతల పేర్లు చెప్పుకుంటూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని కరపత్రంలో పేర్కొన్నారు. స్థానికంగా గల్లీ లీడర్ల ఆగడాలు ఎక్కువయ్యాయని, బెదిరింపులు, సెటిల్మెంట్లతో సామాన్యులను వేధించారని కరపత్రంలో ఆరోపించారు. పై స్థాయి నేతలు అందుబాటులో లేకపోవడంతో కింది స్థాయి నాయకుల చేతుల్లో వ్యవస్థ దారి తప్పిందని, దీనిని ‘స్టీరింగ్ లేని కారు’గా పొల్చుతూ విమర్శలు చేశారు. సిరిసిల్లలో నేత కార్మికుల దుస్థితిని కూడా కరపత్రంలో ప్రస్తావించారు. ఈ కరపత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతుండటంతో, సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.


