ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలి
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య
అన్నారం గ్రామంలో బీఆర్ఎస్ నిరసన
హామీలు అమలు చేయాలంటూ డిమాండ్
కాకతీయ, తుంగతుర్తి : ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో మహిళలకు 2500, వికలాంగులకు 6000, వృద్ధులకు 4000, రైతులకు 15000, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు విద్యాభరోస కార్డు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కానీ ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
హామీలపై ప్రభుత్వాన్ని నిలదీశారు
అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన మాటలు మరిచిపోయారని అన్నారు. ప్రతిపక్షంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కోరారు. ఏప్రిల్ నెలాఖరు వరకు కాల్వల్లో నీరు విడుదల చేయాలని, వరి పంట ఎండిపోకుండా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా నిధులను వాయిదాలుగా కాకుండా ఒకేసారి చెల్లించాలని అన్నారు. వాయిదాల పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు దొంగరి శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, నాయకులు మట్టిపెల్లి వెంకట్, మన్నూరు పోతరాజు, ఇసాకర్, సతీష్, బెడద రాములు, మాజీ సర్పంచ్ సోమశేఖర్, సైదులు, సరిత, బింగి వెంకన్న మహేష్ తదితరులు పాల్గొన్నారు.


