వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవాలు
అభిషేకాలు, హోమాలతో పూజా కార్యక్రమాలు
యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ ఘనంగా నిర్వహణ
కాకతీయ, వేములవాడ : శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయని దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తుల సందోహంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న నవరాత్రోత్సవాల్లో భాగంగా 8వ రోజు పూజలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారికి పంచోపనిషత్ విధానంలో అభిషేకం చేసి, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు చేశారు. యాగశాలలో పుణ్యాహవచనం, మూలమంత్ర హోమం, పరివార దేవతల హోమాలు నిర్వహించారు. అనంతరం అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
భక్తి కార్యక్రమాలు కొనసాగింపు
ఈ కార్యక్రమానికి కన్యాదాతలుగా మరింగంటి విజయసారథి–కర్ణ దంపతులు పాల్గొన్నారు. వేద పండితులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీరామ నవరాత్రి సందర్భంగా రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక పారాయణాలు నిర్వహించారు. గురువారం సాయంత్రం శంకరమఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా అన్ని ధార్మిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


