మొబైల్ రికవరీలో సిరిసిల్లకు దేశవ్యాప్త ఖ్యాతి!
సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు వేగవంతమైన సేవలు
78 శాతం రికవరీతో దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానం
ఇప్పటివరకు 2,286 ఫోన్లు బాధితులకు అప్పగింత
జిల్లా పోలీసుల పనితీరును అభినందించిన రాష్ట్ర డీజీపీ
సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే హర్షం
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : మొబైల్ ఫోన్ల రికవరీ విషయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక వ్యవస్థను సమర్థంగా వినియోగిస్తూ 78 శాతం రికవరీ రేటు సాధించి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. ఆధునిక సాంకేతికతను ప్రజాసేవ కోసం సమర్థంగా ఉపయోగించి జిల్లా పోలీసు యంత్రాంగం విశేష విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. జిల్లాలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైళ్లపై వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తూ, ప్రత్యేక గుర్తింపు సంఖ్యల ఆధారంగా అన్వేషణ చేసి ఇప్పటివరకు 2,286 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేశారు. ఈ ఘనతతో సిరిసిల్ల జిల్లా పోలీసు శాఖ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
సాంకేతికతతో సమస్యలకు పరిష్కారం
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే ప్రత్యేక విధానం ద్వారా అన్వేషణ ప్రారంభించి తక్కువ సమయంలోనే ఫోన్లను గుర్తిస్తున్నారు. వివిధ నెట్వర్క్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ వేగంగా చర్యలు తీసుకోవడం వల్లే ఈ స్థాయి ఫలితాలు సాధ్యమయ్యాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే సిరిసిల్ల పోలీసులు ప్రజలకు అత్యంత వేగంగా సేవలు అందిస్తున్నారని ప్రశంసలు వస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి ప్రజలకు ఉపశమనం కలిగించడంలో జిల్లా పోలీసుల కృషి ఆదర్శంగా నిలుస్తోంది.
డీజీపీ ప్రశంసలు – జాతీయ స్థాయి పురస్కారం
ఈ ఘనతపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ జిల్లా పోలీసు అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. మొబైల్ రికవరీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలో దక్షిణ భారత స్థాయిలో మొదటి స్థానం దక్కడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన కేరళలోని ఎర్నాకులంలో జరగనున్న జాతీయ స్థాయి సదస్సులో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పాల్గొని అవార్డును స్వీకరించనున్నారు. మొబైల్ ఫోన్ల రికవరీలో అనుసరించిన ఉత్తమ విధానాలు, విజయవంతమైన కార్యాచరణ వ్యూహాలను ఆ సమావేశంలో వివరించనున్నారు.
ఎస్పీ మహేష్ బి గితే హర్షం
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ, మొబైల్ రికవరీలో దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం తెలంగాణ పోలీసుల నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే వేగంగా స్పందించడం, ఆధునిక సాంకేతిక విధానాలను పూర్తిస్థాయిలో వినియోగించడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ సాంకేతిక సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. మొబైల్ రికవరీలో కీలకంగా పనిచేసిన ఐటీ విభాగం ఎస్ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ తిరుమలేష్తో పాటు జిల్లా వ్యాప్తంగా పనిచేసిన అన్ని పోలీస్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా ఉపయోగిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పోలీస్ శాఖ ముందుకు సాగుతుందని తెలిపారు.


