ఘనంగా ప్రారంభమైన శివరాత్రి వేడుకలు…
పట్టు వస్త్రాలు సమర్పించిన
మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కాకతీయ, సిరిసిల్ల టౌన్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భీమేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… వేములవాడ ఆలయం రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవాలయమని పేర్కొన్నారు.గతంలో ఆలయ అభివృద్ధి కోసం పోరాటం చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేబినెట్ మంత్రులు, స్థానిక శాసన సభ్యుల చొరవతో ఆలయ అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు.వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల దేవుడిగా భావించే వేములవాడ రాజన్న ఆలయం, అలాగే సమ్మక్క సారలమ్మ ఆలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు.

వేములవాడ రాజన్న ఆలయాన్ని సుమారు రూ.150 కోట్ల వ్యయంతో 4 ఎకరాల విస్తీర్ణంలో సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి, మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని వెల్లడించారు. రాజన్న ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ పరమశివుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పారదర్శక, ప్రజాకేంద్రీకృత పరిపాలన అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో ప్రజా పాలన మరింత బలపడాలని రాజన్నను వేడుకున్నట్లు తెలిపారు.మహా శివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవస్థానం, జిల్లా యంత్రాంగం భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేసింది.


