బాత్రూంలో సీక్రెట్ కెమెరా..
బల్బు హోల్డర్లో రహస్యంగా ఏర్పాటు
దారుణానికి ఒడిగట్టిన ఇంటి యజమాని
అద్దెకు ఉంటున్న వివాహిత వీడియోలు రికార్డ్ !
పోలీసులను ఆశ్రయించిన దంపతులు
ఇంటి యజమాని అశోక్ యాదవ్ అరెస్ట్..
పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ కోసం పోలీసుల గాలింపు
హైదరాబాద్లోని జవహర్ నగర్లో ఘటన
కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్లోని జవహర్ నగర్లో ఇంటి యజమాని దారుణానికి తెగబడ్డాడు. తన ఇంట్లో కిరాయికి ఉంటున్న దంపతులను లక్ష్యంగా చేసుకొని వారి బాత్రూమ్ బల్బ్లో రహస్యంగా సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేశాడు. ఇది గమనించిన బాధిత మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. యజమాని అశోక్ యాదవ్ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన అద్దె ఇళ్లలో ఉండే వారి భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
బల్బు పాడవడంతో..
పోలీసుల వివరాల ప్రకారం.. జవహర్ నగర్లోని అశోక్ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లో ప్రైవేట్ ఉద్యోగం చేసే దంపతులు అద్దెకు నివాసం ఉంటున్నారు. ఈ నెల 4న ఆ ఇంట్లోని బాత్రూమ్ బల్బ్ పని చేయకపోవడంతో.. దంపతులు ఆ విషయాన్ని ఇంటి యజమానికి తెలిపారు. యజమాని ఎలక్ట్రీషియన్ను పిలిపించి కొత్త బల్బ్ను అమర్చేందుకు వచ్చాడు. అయితే.. బల్బ్తోపాటు దాని హోల్డర్లో రహస్యంగా సీక్రెట్ కెమెరాను కూడా ఏర్పాటు చేయించారు. దీంతో.. ఆ ఇంట్లో నివసించే వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించాడు.
కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు ధ్వంసం
ఈ నెల 13న.. బాత్రూమ్లోని బల్బ్ హోల్డర్ స్క్రూ ఊడిపోవడంతో.. ఆ మహిళ తన భర్తకు చూడమని చెప్పింది. హోల్డర్ను విప్పి పరిశీలించిన భర్తకు అందులో దాచి ఉంచిన సీక్రెట్ కెమెరా కనిపించి షాక్కు గురయ్యారు. బాధిత దంపతులు వెంటనే ఈ విషయాన్ని ఇంటి యజమాని దృష్టికి తీసుకువెళ్లారు.
అయితే.. యజమాని వారి మాటలను పట్టించుకోకుండా, ఈ పని ఎలక్ట్రీషియన్ చేసి ఉంటాడని బుకాయించేందుకు ప్రయత్నించాడు. అంతేగాక కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను ధ్వంసం చేయడంతోపాటు కొత్తగా బల్బ్ను ఏర్పాటు చేశాడు. దీంతో.. ఆ జంట న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా, సంచలనాత్మక విషయాలు వెల్లడయ్యాయి. ఇంటి యజమాని అశోక్ యాదవ్ ఆదేశాల మేరకే ఎలక్ట్రీషియన్ చింటూ కెమెరాను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. వెంటనే ప్రధాన నిందితుడు అశోక్ యాదవ్ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


