కాకతీయ, వరంగల్ సిటీ: సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యా రాణి పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని అన్నారు. బహుజన ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన, ప్రజల కోసం పోరాడిన నేతగా పేరుగాంచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు ఈనాటి సమాజానికి మార్గదర్శకాలు కావాలని, ఆయన చూపిన ధైర్యం, తెగువ, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం అందరికీ ఆదర్శమని , వారి ఆశయాలను కొనసాగించాలని పేర్కొన్నారు. మన పూర్వీకుల జీవన పద్ధతుల్ని, కృషిని ప్రతిబింబించే ఈ వృత్తులను మరువకుండా, తదుపరి తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ, డిఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, గౌడ సంఘ నాయకులు గట్టు రమేష్ గౌడ్, సుధాకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రమేష్ గౌడ్, వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.


