ఇసుక దొంగలు
శంకరపట్నం మండలంలో ఇష్టారాజ్యంగా దందా
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ రవాణా
ఉదయం 4 గంటల నుంచే తరలింపు
నిత్యం 200కుపైగా ట్రాక్టర్లలో తరలుతున్న వైనం
మైనర్లే డ్రైవర్లు.. సిండికేట్గా మాఫియా
నిద్రావస్థలో రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు
కాకతీయ, శంకరపట్నం : మండలంలో ఇసుక అక్రమ దందా రోజురోజుకూ రెచ్చిపోతూ బహిరంగ సిండికేట్ వ్యవస్థగా మారింది. కొంతమంది వ్యక్తులు చేతులు కలిపి ఏర్పాటు చేసిన సిండికేట్, ప్రభుత్వ ఇందీరమ్మ ఇండ్ల పేరును కవచంగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వి తరలిస్తూ లక్షలు కొల్లగొడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే ఈ దందాకు ప్రధాన బలమైందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. వీణవంక మండల పరిధిలోని చల్లూరు ఇసుక రీచ్ నుంచి ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమయ్యే తవ్వకాలు ఉదయం 9 గంటల వరకు నిరవధికంగా కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమని చెప్పుకుంటూ ట్రాక్టర్లలో ఇసుకను తరలించడం నిత్యకృత్యంగా మారిందని ఆరోపిస్తున్నారు. నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ దందా వెనుక ఎవరి అండ ఉందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. రోజువారీగా భారీ ఎత్తున ఇసుక తరలింపులు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల నుంచి ఎలాంటి కట్టడి చర్యలు కనిపించకపోవడం ఇసుక మాఫియాకు అధికారుల అండదండలు మెండుగా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మైనర్లతో డ్రైవింగ్…
శంకరపట్నం మండలంలో ఇసుక రవాణాలో నిబంధనలు పూర్తిగా కనుమరుగైన పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభమయ్యే ఈ అక్రమ రవాణా చల్లూరు ఇసుక రీచ్కే పరిమితం కాకుండా మండల పరిధిలోని నదుల నుంచి కూడా యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజూ 200 నుంచి 300 వరకు ట్రాక్టర్లలో భారీ ఎత్తున ఇసుక తరలింపు జరుగుతుండటం అధికార యంత్రాంగం వైఫల్యాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నదని స్థానికులు విమర్శిస్తున్నారు. అక్రమ రవాణాను గుర్తించకుండా ఉండేందుకు ట్రాక్టర్లపై నెంబర్ ప్లేట్లు లేకుండా లేదా నెంబర్లు స్పష్టంగా కనిపించని విధంగా ఏర్పాటు చేసుకోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా, ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అధిక శాతం మైనర్ బాలురే నడుపుతున్నారనే విషయం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. చట్టాలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ దందా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత శాఖల నుంచి ఎలాంటి కట్టడి చర్యలు కనిపించకపోవడం విమర్శలకు కారణమవుతోంది.
మామూళ్ల మత్తులో అధికారులు!
శంకరపట్నం మండలంలో నిత్యం వందలాది ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక బహిరంగంగా తరలుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళ్లముందే దందా సాగుతున్నా నామమాత్రపు కేసులతో సరిపెట్టడం వెనుక కారణాలపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక సిండికేట్ నుంచి నెలవారీగా అందుతున్న మామూళ్లే అధికారుల మౌనానికి కారణమన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అక్రమ దందాను అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్న అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతుందన్న ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


