- అత్యవసర ఖర్చులు.. సదుపాయాలకు కేటాయింపు
- విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బందికి ఫేసియల్ రికగ్నైజేషన్
- వైద్య కళాశాలలతో హాస్టళ్ల అనుసంధానం.. విద్యార్థులకు వైద్య పరీక్షలు
- ఆహార నాణ్యతను తనిఖీ చేయాలని ఆదేశాలు…
- సంక్షేమ వసతి గృహాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- వైద్య సేవలు, విద్యా సాంకేతికత, తనిఖీలకు ప్రత్యేక యాప్లు
కాకతీయ, హైదరాబాద్: బీసీ, ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లో అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.60 కోట్లు కేటాయించింది. ఈ నిధులను హాస్టళ్లలో డైట్ ఛార్జీలు , తాత్కాలిక సిబ్బంది జీతాల విడుదల, హాస్టళ్లలో మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వాటిని వినియోగించుకునే వెసులుబాటు కలిగించింది. హాస్టళ్లకు కేటాయించిన నిధుల చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల సీనియర్ అధికారులకు అందజేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ గృహాలు, విద్యా సంస్థలపై ఐసీసీసీలో సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు.
ప్రత్యేక శ్రద్ధ వహించాలి
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, బోధన , బోధనేతర సిబ్బంది ముఖ గుర్తింపునకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. పూర్తి స్థాయి డేటా… జవాబుదారీతనం ఉండాలని అన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు యాప్ను ఉపయోగించాలని సీఎం సూచించారు. విద్యార్థులకు విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన నాణ్యమైన, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని… దాంతో వారికి లభించే కేలరీలను తెలుసుకోవాలని ఆదేశించారు. హాస్టల్ విద్యార్థులకు అందించే యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో సక్రమంగా అందేలా సీనియర్ అధికారులు చూసుకోవాలని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ధారించాలని సీఎం సూచించారు. హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్బోర్డ్లో అప్లోడ్ చేయాలని సీఎం ఆదేశించారు.
మ్యాచింగ్ గ్రాంట్ను వెంటనే విడుదల చేయాలి
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లకు స్కాలర్షిప్లు , సిబ్బంది జీతాలు , డైట్ ఛార్జీలు , నిర్మాణ ఖర్చులు , ఇతర ఖర్చులు, బకాయిల చెల్లింపు, హాస్టళ్ల నిర్వహణకు అయ్యే నెలవారీ ఖర్చులు, బకాయిల చెల్లింపుకు అవసరమైన మొత్తానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్లను ఆదేశించారు. హాస్టళ్ల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 24 గంటలూ ఆన్లైన్లో వైద్యులు అందుబాటులో ఉండేలా హాట్లైన్ ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఎడ్ టెక్ను ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు.


