మెట్పల్లి గ్రామంలో దొంగల బీభత్సం..
-భయాందోళనలో గ్రామస్తులు
-ఇంటికి తాళాలు వేసిన ఇల్లే టార్గెట్
-రాత్రిపూట పోలీస్ గస్తీ పెంచాలంటూ డిమాండ్
కాకతీయ, శంకరపట్నం: మండలంలోని మెట్పల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నెల 5వ తేదీన మొలంగూర్ గ్రామంలో దొంగతనం జరిగి వారం రోజులు కూడా గడవకముందే మళ్లీ మెట్పల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రజల్లో భయాందోళనలకు కారణమైంది. గ్రామంలోని సుమారు 7 ఇళ్లలో గుర్తుతెలియని దొంగలు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించినట్లు సమాచారం. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు కోసం అల్మారాలు మరియు ఇతర సామాన్లను అస్తవ్యస్తం చేసినట్లు బాధితులు, గ్రామస్థులు తెలిపారు. దొంగల సంచారాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఏసీపీ మాధవి సీఐ పులి వెంకట్ ఎస్సై శేఖర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవలి కాలంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నప్పటికీ పోలీసులు సరైన రీతిలో పెట్రోలింగ్ నిర్వహించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామంలో రాత్రిపూట పోలీసుల గస్తీ పెంచాలని మండల ప్రజలు కోరుతున్నారు.


