- జూబ్లీహిల్స్లో ఓడిపోతామన్న ప్రస్టేషన్లో సీఎం
- కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ బెదిరింపులు
- కాంగ్రెస్ పాలనలో క్షీణించిన శాంతి భద్రతలు
- బీఆర్ఎస్ నేత బాల్క సుమన్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడుతున్నారని, గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి భాష మాట్లాడలేదని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్లో ఓడిపోతామన్న ప్రస్టేషన్లో నిన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బజారు భాష మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ ను మున్సిపల్ శాఖ మంత్రిగా హోంమంత్రిగా బాగు చేయడంలో విఫలమయ్యాడని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి మద్దతుతో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాల్క సుమన్ ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. పట్టపగలే హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో పారిశ్రామిక రంగం, రియల్ ఎస్టేట్ రంగం పెరిగిందని తెలిపారు. కేసీఆర్ పాలనలో పెట్టుబడులకు తెలంగాణ గేట్వే ఆఫ్ ఇండియాగా ఉంటే.. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ గన్ కల్చర్కు అడ్డగా మారిందని బాల్క సుమన్ విమర్శించారు.
రణరంగంగా జూబ్లీహిల్స్..
జూబ్లీహిల్స్ సంగమం లాంటి నియోజకవర్గమని బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రవర్తన ఎలా ఉందో ఆలోచించుకోవాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తిరోగమన దిశగా కొనసాగుతోందని బాల్క సుమన్ విమర్శించారు. వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని అన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రి, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరగడం లేదని మండిపడ్డారు.ఆరు గ్యారంటీలు అన్నారని.. ఒక్క గ్యారంటీ కూడా అమలుకు నోచుకోలేదని తెలిపారు. రైతు డిక్లరేషన్ అన్నారని.. రైతులకు ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. మంత్రివర్గం మొత్తం జూబ్లీహిల్స్లో దిగారని.. జూబ్లీహిల్స్ను రణరంగంగా మార్చేశారని అన్నారు. ఆడబిడ్డ కన్నీళ్లపై డ్రామా అని మంత్రులు మాట్లాడుతున్నారని.. గోపీనాథ్ కూతుళ్లు ప్రచారం చేస్తే వాళ్లపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.


