- రాష్ట్ర పరిధిలో అన్ని ప్రయత్నాలు చేశాం
- ఇక బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాల్సిందే..
- మంత్రులు వాకిటి శ్రీహరి,పొన్నం ప్రభాకర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో దసరా కంటే ముందే బీసీ బిడ్డలకు పండుగ వచ్చిందని, 42 శాతం రిజర్వేషన్లు బీసీ బిడ్డలకు వరమని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అన్నారు. గాంధీ భవన్లో మంత్రులు వాకిటి శ్రీహరి,పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. అందరికీ బతుకమ్మ,దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మేము ఎంతో మాకు అంతా వాటా అని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన చేశారన్నారు. కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని.. రిజర్వేషన్లు ఎవరికి వ్యతిరేకం కాదు…ఎవరి నోటి కాడ ముద్ద లాక్కోవడం లేదన్నారు. వాస్తవానికి బీసీలకు రిజర్వేషన్లలలో ఇంకా వాటా రావాలి కానీ కుదించుకొని 42 శాతం అడుగుతున్నామన్నారు.
బట్ట కాల్చి మీద వేస్తాం అంటే ఎలా ..
పార్టీల మెప్పుకోసం, నాయకుల మెప్పు కోసం మాట్లాడి సమాజంలో తలవంపులు తెచ్చుకోవద్దని మంత్రులు హితవుపలికారు. ఇది న్యాయపరమైన కోరిక అని, రిజర్వేషన్లు అమలు కాకపోతే బీసీ బిడ్డలు ఇంకా వెనకబడిపోతారన్నారని అన్నారు. రాష్ట్రాల్లో ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి కేంద్రం బిల్లుకు ఆమోదం తెలపాలన్నారు. అంతేకాని మీరే హామీ ఇచ్చారు….మీరే చేయాలి అని బట్ట కాల్చి మీద వేస్తాం అంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర పరిధిలో ఉన్న అన్ని ప్రయత్నాలు చేశాం….ఇప్పుడు కేంద్రం చేయాలని విజ్క్షప్తి చేశారు. అనుమానాలు ఉంటే వ్యక్తం చేయమని చెప్పాం అని, అవేమీ చేయకుండా బీజేపీ నాయకులు కాళ్లలో కట్టే పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ బిడ్డలందరికీ పోటీ చేసే అవకాశం దొరికింది…. దయచేసి అన్ని వర్గాలు సహకరించాలని మంత్రులు కోరారు.


