రెడ్ అలర్ట్
తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు
రేపటి నుంచి మరింత పెరగున్న ఉష్ణోగ్రతలు
10 రోజులపాటు తీవ్రమైన వడగాలులు
ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు జిల్లాల్లో మరింత అధికం
వాతావరణశాఖ హెచ్చరికలు
ఇప్పటికే వేసవితాపంతో అల్లాడతున్న ప్రజలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఈ మేరకు ఐఎండీ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 12 నుంచి 22 వరకు వరుసగా 10 రోజుల పాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల నుంచి 45 వరకు పెరిగే అవకాశం ఉంని హెచ్చరించింది. హైదరాబాద్లో కూడా 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ప్రజలు మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్స్ జారీ చేసింది. అయితే సాయంత్రం పూట అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉన్నప్పటికీ, అవి కేవలం గాలిలో తేమను పెంచి ఉక్కపోతను అధికం చేస్తాయంటోంది. అటు హైదరాబాద్లో కూడా పరిస్థితి దారుణంగా ఉండబోతోందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ పదిరోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల వరకు కొనసాగే అవకాశం ఉందంటోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకురావొద్దని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా చెట్లు ఎక్కువగా ఉన్న ఓయూతో పాటు హెచ్ సీయూ, సైనిక్ పురి వంటి కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలైన సనత్ నగర్, బాలానగర్, పఠాన్ చెరువు, చెంగిచెర్ల, ఘట్ కేసర్, చర్లపల్లి వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలున్నాయి.


