సౌభ్రాతృత్వానికి ప్రతీకగా రంజాన్ వేడుకలు
అమీనాబాద్ మదీనా మసీదులో ఘనంగా నిర్వహణ
కాకతీయ,చెన్నారావుపేట : చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలోని మదీనా మసీదులో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పండుగ సందర్భంగా మసీదు ప్రాంగణం సోదరభావంతో కళకళలాడింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ త్యాగం, దయ, శాంతికి ప్రతీక అని పేర్కొన్నారు. మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని, పండుగలను కలిసిమెలిసి జరుపుకోవడం ద్వారా సామరస్యాన్ని పెంపొందించుకోవచ్చని అన్నారు. సమాజంలో మత సామరస్యం మరింత బలపడాలని ఆకాంక్షించారు.
మసీదు ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ముస్లిం మత పెద్దలు, స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పరస్పరం ఆలింగనం చేసుకుంటూ ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక ప్రజల రాకతో మసీదు పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.
ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ మురహరి రవి, ఎంపీటీసీ సాయిలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చీర అశోక్, ముడుసు శ్రీకాంత్, సొసైటీ మాజీ డైరెక్టర్ ముస్కు ఐలయ్య, వార్డ్ సభ్యుడు రాశి మహేందర్, పోతరాజు కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. మసీదు కమిటీ అధ్యక్షుడు షేక్ ఇమామ్, ఉపాధ్యక్షుడు షేక్ నబీ, సభ్యులు సయ్యద్ అహ్మద్, షేక్ దస్తగిరి, షేక్ అన్వర్, యూసఫ్, అల్లావల్లి, లాలూ, కరీం, యాకూబ్, నూరుల్లా పాషా, పెద్ద కరీం తదితరులు హాజరయ్యారు.


