శిక్షణా కేంద్రానికి రాజమౌళి పేరును కేటాయిస్తం..
*పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క హామీ..
*ప్రతి గ్రామపంచాయతీ గ్రామసభలో రాజమౌళి చరిత్రను వినిపిస్తాం..
*తెలంగాణ పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క
*రాజమౌళి ఇతరుల గుర్తింపు కోసం పని చేసిన వ్యక్తి కాదు..
*గ్రామ అభివృద్ధి దేయంగా పనిచేసిన వ్యక్తి రాజమౌళి
*పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి..
కాకతీయ, గీసుగొండ: తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శిక్షణ కేంద్రానికి కూసం రాజమౌళి పేరును కేటాయిస్తామని పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామమైన గంగాదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా బాలవికాస ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ సభలో మంత్రి ఈ ప్రకటన చేశారు.మంత్రి సీతక్క మాట్లాడుతూ రాజమౌళి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి అని,వ్యక్తిగత గుర్తింపు కోసం కాకుండా సమాజం కోసం పని చేసిన నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు. గ్రామస్తులను ఐక్యంగా చేసుకుని ఒక్కొక్క అడుగు ముందుకు వేసి అభివృద్ధిని సాధించిన తీరు ఆదర్శప్రాయమని తెలిపారు.గంగాదేవిపల్లి గ్రామ అభివృద్ధికి కూసం రాజమౌళి చేసిన కృషి రాష్ట్రంలోనే అన్ని గ్రామ పంచాయతీల గ్రామసభల్లో వినిపించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గ్రామంలోని తెలంగాణ గ్రామీణ శిక్షణ కేంద్రానికి రాజమౌళి పేరును ఖచ్చితంగా కేటాయిస్తామని, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాజమౌళి తక్కువ చదువుకు న్నప్పటికీ సామాజిక స్పృహతో గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన నాయకుడని తెలిపారు. గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారని, ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను 90 దేశాల ప్రతినిధులు అధ్యయనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామస్తులు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జడ్పీ సీఈఓ రాంరెడ్డి,తహసీల్దార్ ఎండి రియాజుద్దీన్,ఎంపీఓ పాక శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ కూసం స్వరూప, బాలవికాస ప్రతినిధి శౌరెడ్డి, రాజమౌళి కుమారులు రమేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


