ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
పట్టణాభివృద్ధికి బడ్జెట్లో భారీ కేటాయింపులు
రూ.200 కోట్ల అంచనా నిధులతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద
కాకతీయ, రామకృష్ణాపూర్ : ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. ఆదివారం క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, అధికారులతో కలిసి ప్రారంభించారు. మంత్రి గడ్డం వివేకానంద మాట్లాడుతూ, మున్సిపాలిటీలో 200 కోట్ల రూపాయల అంచనా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. వార్డుల్లో సిసి రహదారులు నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీనివాస గార్డెన్ నుంచి అమ్మ గార్డెన్ వరకు హైమాస్ లైట్ల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. పనులు నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలో రహదారులు, మురుగు కాలువలు, లైటింగ్, త్రాగునీటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇంటింటికి నల్లా కనెక్షన్లు అందిస్తున్నామని చెప్పారు. క్యాతనపల్లిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. అమృత్ పథకం కింద త్రాగునీరు అందిస్తున్నామని తెలిపారు. డిఎంఎఫ్టి, సిఎస్ఆర్ నిధులతో పనులు చేపడుతున్నామని చెప్పారు. హైమాస్ లైట్లు, సిసి రహదారులు, బోర్ వెల్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, డిఎంఎఫ్టి నిధులతో పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. సోలార్ హైమాస్ లైట్ల ద్వారా విద్యుత్ ఖర్చు తగ్గిస్తున్నామని చెప్పారు. వేసవిలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెరువుల అభివృద్ధి, శుభ్రతపై దృష్టి పెట్టామని చెప్పారు. మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


