ప్రజా పాలనా.. రాక్షస పాలనా ?
అంగన్వాడీ టీచర్లపై రేవంత్ ప్రభుత్వం కర్కశత్వం
ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా ?
అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలించడం సిగ్గుచేటు
మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అయలు చేయాలని డిమాండ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : అంగన్వాడీ టీచర్లపై రేవంత్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఛలో సెక్రెటేరియట్ పిలుపునిచ్చిన అంగన్వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటూ బీరాలు పలికిన రేవంత్ రెడ్డి, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడ అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలించడం సిగ్గుచేటన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా? గుర్తింపు లేదా? ప్రజా పాలన అని రాక్షస పాలన కొనసాగిస్తారా? అని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సంబురం లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారి ఉసురు తగులుతుంది. అంగన్ వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ వారు వర్కర్లు కాదని, అంగన్ వాడీ టీచర్లు అని పోస్టును ఉన్నతీకరించారు. వారి గౌరవాన్ని పెంచారు. 2014 నాటికి అంగన్ వాడీ టీచర్లకు కేవలం రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేది.కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని రూ.13,650లకు, మినీ అంగన్ వాడీ టీచర్ల వేతనాన్నిరూ.7,800లకు, అంగన్ వాడీ హెల్పర్ల వేతనాన్ని రూ.7,800 లకు పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించారు. అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 18,000లకు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారు. మాయ మాటలు చెప్పి, 22 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అతీ లేదు, గతీ లేదని విమర్శంచారు. మహాలక్ష్మి పేరిట మీరు అమలు చేస్తున్న ఉచిత బస్సుల్లోనే జిల్లాల నుంచి సచివాలయం వద్దకు వచ్చి మిమ్మల్ని నిలదీస్తున్నారు. మీ మోసపూరిత వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్టులు చేసిన అంగన్ వాడీలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల మేనిఫెస్టోలో వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.


